ఈనెల 22న కుప్పంకు CM YS Jagan Mohan Reddy

by Disha Web Desk 21 |
ఈనెల 22న కుప్పంకు CM YS Jagan Mohan Reddy
X

దిశ, ఏపీ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుప్పం నియోజకవర్గంపై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. 2024 ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడును ఓడించి వైసీపీ అభ్యర్థిని గెలిపించే దిశగా సీఎం జగన్ పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా నియోజకవర్గ బాధ్యతలను పార్టీలోని కీలక నేతలకు అప్పగించారు. ఇటీవల జరిగిన నియోజకవర్గాల సమీక్షలను సైతం సీఎం జగన్ కుప్పం నుంచే ప్రారంభించారు. ఈ సందర్భంగా కుప్పం మున్సిపాలిటీకి రూ.66 కోట్లతో వరాల జల్లుకురిపించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈనెల 22న సీఎం వైఎస్ జగన్ కుప్పం నియోజకవర్గంలో పర్యటించాలని నిర్ణయించారు.

ఈ మేరకు ముఖ్యమంత్రి పర్యటన ఖరారైనట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కుప్పం పర్యటనలో భాగంగా మున్సిపాలిటీలో రూ.66 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఎమ్మెల్సీ భరత్, జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు హెలీప్యాడ్ కోసం స్థలాలను శుక్రవారం పరిశీలించారు. ఇకపోతే ఇటీవలే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మూడు రోజులపాటు కుప్పంలో పర్యటించారు. కుప్పం పర్యటనలో భాగంగా గతంలో ఎన్నడూ లేనివిధంగా దాడులు జరిగాయి. పలువురు టీడీపీ నేతలు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.

నెలల వ్యవధిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సైతం కుప్పంలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. టీడీపీ నేతలు అడ్డుకుంటారా? అనే అనుమానం కలుగుతుంది. మెుత్తానికి సీఎం వైఎస్ జగన్ కుప్పంపై ఫోకస్ పెట్టడం.. ఎట్టి పరిస్థితుల్లో కుప్పంలో టీడీపీ జెండా మళ్లీ ఎగురేయాల్సిందేనని చంద్రబాబు నిర్ణయించుకున్న నేపథ్యంలో కుప్పం రాజకీయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Also Read: తల్లిలాంటి పార్టీకి రాజీనామా చేయడం బాధ కలిగించింది: వెంకయ్య నాయుడు


Next Story

Most Viewed